గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్న కావేరి ఆసుపత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. అవసరమైన వైద్యం అందించినా ఆయన ఆరోగ్యం మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. దీంతో కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు కావేరి ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు కరుణానిధి కుమారుడు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి, ఆయకు అందిస్తున్న చికిత్స గురించి వివరించారు.
అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం..
కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు డీజీపీ తెలిపారు. సెలవుల్లో ఉన్న పోలీసులంతా డ్యూటీలో చేరాలని డీజీపీ కార్యాలయం నుంచి పోలీసు కమిషనర్లు, డీఐజీలు, జిల్లా ఎస్పీలకు ఫ్యాక్స్ ద్వారా సందేశం వెళ్లింది. కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరి ఆస్పత్రి వద్ద భద్రతను మరింత పెంచారు. ఆస్పత్రి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడికి భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రిస్తున్నారు. మరో వైపు చెన్నైలోని రాజారత్నం స్టేడియం వద్దకు భారీగా పోలీసు బలగాలు చేరుకుంటున్న విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. గోపాలపురంలోని కరుణానిధి నివాసం వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కావేరి ఆసుపత్రికి వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ప్రముఖల వాహనాలను మాత్రమే కావేరి ఆసుపత్రి ప్రాంగణంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు.