2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్లను సమకూర్చుకోవడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈవీఎంలను సెప్టెంబర్ వరకు సిద్ధంగా ఉంచాలని నోట్లో పేర్కొంది.
2019 ఎన్నికల కోసం గతంలో ఈసీ 16.15 లక్షల వీవీ పాట్స్ను తయారీకి ఆర్డర్ ఇచ్చింది. వీటిని సెప్టెంబర్ చివరినాటికి సిద్ధం చేయాలని భెల్, ఈసీఐఎల్ కంపెనీలను ఆదేశించినట్టు సమాచారం.. సుప్రీం ఆదేశాల ప్రకారం ఇకపై ఏఎన్నికలకైనా ఈవీఎంలకు వీవీపాట్స్ యంత్రాలను జత చేయాలని ఈసీ నిర్ణయించింది. దీంతో ఓవైపు ముందస్తు ఎన్నికల ప్రచారం జరగడంతో ఎన్నికల సంఘం కూడా అందుకు తగ్గట్లు ఈ ఏర్పాట్లు చేస్తుందని తెలుస్తోంది.
ఈసీ సంకేతాలతో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని పార్టీలు భావిస్తున్నాయి. ఇంకా ముందుగా జరిగినా సిద్ధంగా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకునిలో పనిలో నిమగ్నమయ్యారు ఆయా పార్టీల నేతలు.. అయితే ఎన్నికలు త్వరగా రానున్నాయనే వార్తలతో పలు పార్టీలు గెలుపు తధ్యమనే భావనంతో ఆనందంగా ముందుకెళ్తుంటే, గెలుపుపై సందేహంతో ఉన్న పార్టీలు మాత్రం ఆందోళన చెందుతున్నాయి.