అతను భారత రాజకీయ నాయకుల్లో కురువృద్ధుడు. కరుడుగట్టిన తమిళ రాజకీయవాది. తమిళ ఉద్యమ కారుడు. కాకలు తీరిన రాజకీయ యోధుడు. అతనే, ఎంకేగా, డా.కళైనర్గా ప్రసిద్ధిగాంచిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ముత్తివేల్ కరుణానిధి. 1969లో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ వ్యవస్థాపకుడు అన్నా దొరై మరణంతో అనూహ్యంగా కరుణా నిధి తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. సౌత్ ఇండియాలో సినీ ఇండస్ట్రీ నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణా నిధి. డీఎంకే పార్టీకి అన్నీ తానై ఇంతకాలం చక్రం తిప్పారు కరుణానిధి. తన 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా 13సార్లు పోటీ చేసి.. 13 సార్లు గెలిచి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. కరుణా నిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కరుణా నిధి అసలు పేరు దక్షిణా మూర్తి ముత్తివేల్. అసలుసిసలైన తెలుగువాడు.
1924 జూన్ 3న తమిళనాడు తంజావూరు జిల్లా పెరుక్కువళై గ్రామంలో ముత్తివేల్, అంజిగం దంపతులకు జన్మించాడు కరుణానిధి. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన వారు. వీరు తమిళనాయీ బ్రాహ్మణ కులానికి చెందిన వారు. కరుణానిధికి షణ్ముగ సుందరాంబల్, పెరియానాయమ్మల్ అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
కేవలం 8వ తరతగి వరకే చదువుకున్న కరుణానిధికి చిన్నప్పట్నుంచే ఉద్యమాలన్నా, సాహిత్యమన్నా ఎంతో ఆసక్తి చూపించేవాడు. మూఢవిశ్వాసాల నుంచి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కరుణానిధి రకరకాల నాటికలు రచించి ప్రదర్శించేవాడు. జస్టిస్ పార్టీ నాయకుడు అళగిరిస్వామి ప్రసంగాలకు ఉత్తేజుడై 14 ఏళ్ల చిరుప్రాయంలోనే హిందీ ఉద్యమంలో పాల్గొని పలుమార్లు అరెస్టయ్యాడు. కరుణానిధి తమిళసాహిత్యంలో కూడా తనదైన ముద్ర వేశాడు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలతోపాటు వివిధ రంగాల్లో ఆయన పేరు తెచ్చుకున్నారు. 1942లో మురుసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు.
అన్నాదొరై మరణం తరువాత కరుణానిధి ముఖ్యమంత్రి అవడాన్ని సహించలేకపోయాడు ఎంజీఆర్. దాంతో డీఎంకే పార్టీ నుంచి చీలిపోయి ఆలిండియాం ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీని స్థాపించి కరుణానిధికి రాజకీయ ప్రత్యర్ధిగా మారాడు. జయలలిత కూడా ఎంజీఆర్వైపే ఉండి కరుణానిధికి రాజకీయ ప్రత్యర్ధిగా మారింది. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కరుణానిధి తన పార్టీ అభ్యర్థుల చేత 40 సీట్లకు పోటీ చేయడమే కాకుండా.. అన్ని స్థానాల్లో గెలిచి తన సత్తా చాటుకున్నాడు. కరుణానిధి 94 ఏళ్ల వయసులోనూ పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చి.. తన రాజకీయ వారసుడు స్టాలిన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఆకాంక్షించాడు. తన జీవితంలో 60 ఏళ్లపాటు రాజకీయాల్లో గడిపిన కరుణానిధి ఆగస్టు 7 2018 సాయంత్రం 6.10 గంటలకు మృతి చెందారు.