దేశంలోనే అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మధ్యప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో 30 ఏళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. జబల్పూర్ నగరంలోని మదన్ మహల్ రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి ఓ మహిళ వింధ్యాచల్ ఎక్స్ప్రెస్ రైలులో ఖాళీగా ఉన్న సాధారణ కంపార్ట్మెంట్లోకి ఎక్కింది. అనంతరం ఆమె అందులోనే నిద్రించింది. ఆ సమయంలో ఆమె వద్దకు వచ్చిన ఓ యువకుడు అత్యాచారం చేశాడని జబల్పూర్ రైల్వే స్టేషన్ పోలీస్ ఇన్ఛార్జీ వై.మిశ్ర తెలిపారు.
ఆ సమయంలో రైలులో విధులు నిర్వర్తిస్తోన్న ఓ రైల్వే పోలీసు ఆఫీసర్.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ప్లాస్టిక్, ఇనుప సామాన్లు సేకరించి అమ్ముకుని జీవిస్తుందని పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి పేరు ఉమేశ్ వాల్మీకి అని, అతడు కూలీగా పని చేస్తున్నాడని చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.