మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లను ఆశించే వారికే కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తప్పనిసరిగా ట్విటర్, ఫేస్బుక్లో అకౌంట్ ఉండాలని వెల్లడించింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండటమే కాకుండా నేతలకు ఫేస్బుక్లో కనీసం 15,000 లైకులు, ట్విటర్లో 5000 మంది ఫాలోవర్లను, పెద్ద సంఖ్యలో వాట్సాప్ గ్రూపుల్లో ఉండాలని పేర్కొంది.వారంతా పార్టీ పోస్టులను రీట్వీట్ చేయాలని, లైక్ కొట్టాలని కోరింది.ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే నేతలంతా ఈనెల 15లోగా వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలను పార్టీకి అందచేయాలని కోరింది
. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా నెటిజన్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే 65000 మంది సైబర్ సైనికులను రంగంలోకి దించగా, కాంగ్రెస్ పార్టీ తరపున 4000 మంది రాజీవ్ సిపాయిలు మాత్రమే పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు తమపై బురద చల్లితే సోషల్ మీడియా వేదికగా తాము తిప్పికొడుతున్నామని బీజేపీ, కాంగ్రెస్ ఐటీ విభాగం చెబుతున్నాయి.
అయితే దేశవ్యాప్తంగా ప్రతీ రాజకీయ పార్టీలోనూ ఈసారి సోషల్ మీడియా ప్రభావం ఉంటుందని అందుకు తగ్గట్టుగా అభ్యర్ధులు ప్రచారం చేసుకోవాలనే సూచనలు వినిపిస్తున్నాయి. దీంతో జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలంతా సోషల్ మీడియా వింగ్ లు మెయింటెయిన్ చేసుకునేందుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు