గుంటూరు జిల్లా నరసరావు పేటలో బుధవారం ఆర్టీసీ బస్సులో ఓ కానిస్టేబుల్ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. నరసరావుపేట నుంచి వినుకొండ వెళ్లే బస్సులో నాగేశ్వర రావు అనే కానిస్టేబుల్ ఇద్దరు ఖైదీలను వెంటబెట్టుకొని ఎక్కాడు. అప్పటికే ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులను లేపేసాడు. దానికి వారు నిరాకరించటంతో అంతు చూస్తానంటూ బెదిరించాడు. ఆ సమయంలో మరో ప్రయాణికుడు కలుగజేసుకోగా అతని చొక్కా పట్టుకొని దురుసుగా వ్యవహరించాడు.
మహిళా ప్రయాణికురాలితో సైతం అసభ్యకరంగా మాట్లాడాడు. ఇష్టారాజ్యంగా ప్రయాణికులతో వాదనకు దిగటంతో బస్సు డ్రైవర్ ప్రయాణికులకు సర్దిచెప్పి సీటు ఖాళీ చేయించి ఇప్పించాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రయాణికులు అనటంతో దిక్కున్నచోట చెప్పుకోమని కానిస్టేబుల్ బెదిరించాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మద్యం తాగి వచ్చి అనుచితంగా ప్రవర్తించాడని ప్రయాణికులు వాపోయారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.