ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన కంపెనీలో ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)లో జరిగిన లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొని మాట్లాడిన ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి తాను పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని, ఎన్నికల్లో వైసీపీ విజయానికి సహకరిస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. ఇవన్నీ పుకార్లేనని, వీటిల్లో నిజంలేదన్నారు.
తనను జగన్ 300నుంచి 400కోట్లు ఇచ్చారన్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు. జగన్ తన పార్టీకోసం పనిచేయడానికి రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవడం వాస్తవమే అన్నారు. వైసీపీకి జగన్ ఓ పెద్ద అసెట్(జగనే బలం) అంటూ అభివర్ణించిన ప్రశాంత్ కిశోర్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం తధ్యమంటూ సన్నిహితుల వద్ద వెల్లడించారు. వైసీపీకి ప్రజల్లో ఎనలేని ప్రేమాభిమానాలున్నాయన్నఆయన ఎన్నికల వ్యూహాలను బహిర్గతం చేయకూడదన్నారు.