ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉండాలని వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కో-ఆర్డినేటర్లకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైయస్ జగన్ పార్టీ కో-ఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ నియోజకవర్గ సమన్వయ కర్త రోజూ రెండు బూత్లలో పర్యటించి గడగడపనూ సందర్శించాలని సూచించారు. సెప్టెంబరు 17 నుంచి బూత్ల వారీగా కార్యక్రమాలు జరపాలని, వారానికి ఐదురోజులపాటు ఆయా బూత్లకు చెందిన కార్యకర్తలు ఆయా కుటుంబాలతో మమేకం కావాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా సమస్యలు, ఇతరత్రా అంశాలు గుర్తించాలన్నారు. సమయం తక్కువగా ఉందని, ఇదే ఆఖరి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని, బూత్ కమిటీతో సమీక్ష చేసుకుని, ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణలపై దృష్టి పెట్టాలన్నారు. పాదయాత్ర కొనసాగుతుండగానే నియోజక వర్గాలు, బూత్ల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బూత్ల సందర్శన మొదటి విడతలో భాగంగా నిర్దేశించిన మొదటి 50 బూత్ల సందర్శన మొదటి నెలలోనే పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ లోపాలు కనిపించినా సరిద్దాలని, ప్రతీ 30 నుంచి 35 కుటుంబాలకు ఒక బూత్ కమిటీ సభ్యుడి చొప్పున కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు.
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ‘నవరత్నాలు’ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేందుకు దోహదం చేశాయని, ఇంటింటికి నవరత్నాలను చేర్చాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. చంద్రబాబు ప్రలోభాలను అడ్డుకోగలమంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఈ నెల 17 నుంచి బూత్ల వారీగా రావాలి జగన్..కావాలి జగన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ధర్మాన పిలుపునిచ్చారు.