గణపతి నవరాత్రి ఉత్సవాలు గ్రేటర్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహానగరం పరిధిలో ఈసారి వీధులు, ముఖ్య కూడళ్లలో సుమారు 35 వేల గణనాథులను ప్రతిష్ఠించినట్టు జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు అంచనా వేస్తున్నాయి. శాస్త్రోక్తంగా పూజలందుకొన్న గణనాథులను మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల్లో నిమజ్జనం చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హుస్సేన్సాగర్ సహా గ్రేటర్ పరిధిలోని 50 చెరువుల వద్ద ఏర్పాట్లు చేసింది. నిమజ్జన పనులకోసం రూ.10 కోట్లు కేటాయించింది. నిమజ్జనం జరిగే ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో అవసరమైన పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.
మార్గం పొడవునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్రకు మూడు రోజుల మందే పూర్తిస్థాయిలో పనులు చేపడతామని ఇంజినీర్లు చెబుతున్నారు. తాత్కాలిక విద్యుత్ దీపాల ఏర్పాటు, గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసం 107 మొబైల్ క్రేన్లు, 81 స్టాటిక్ క్రేన్లను నిమజ్జనం జరిగే చెరువుల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. శోభాయాత్ర సందర్భంగా మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు తదితర సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు.