రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్కు పోటీ అని మంత్రి కేటీఆర్ అన్నారు.ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని అన్నారు. నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరంగా ఉండి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ సొంతంగా నిలబడే దమ్ము లేక టీడీపీని కలుపుకొంటానంటోందని, తెలంగాణ పాలిట ఈ కూటమి స్వాహా కూటమి అని విమర్శించారు.
సనత్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జలవిహార్లో మంత్రి తలసాని అధ్యక్షతన ఆదివారం జరిగింది. దీనికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.తెలుగు రాష్ట్రాలను మోసంచేసిన భారతీయ జూటా పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు అద్భుతాలు చేసి ఉంటే ఈరోజు సమస్యలు ఎందుకుంటాన్నాయో ప్రజలు ఆలోచించాలని కోరారు.
గడువు పూర్తికాకుండానే అసెంబ్లీని రద్దుచేసి ప్రజలపై భారం మోపారంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ 9 నెలలకు ముందుగానే ఎన్నికలకు పోలేదా.. 2004లో ప్రధానిగా ఉన్న వాజపేయి కూడా ముందస్తు ఎన్నికలకు పోలేదా అని ప్రశ్నించారు. బీజేపీచేస్తే ఒప్పు.. కేసీఆర్ చేస్తే తప్పా? అని నిలదీశారు. రూ.2.30 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చామని అమిత్షా చెప్తున్న నిధులు బీజేపీ పార్టీ నిధుల నుంచి ఇవ్వలేదని.. రాష్ట్రం కట్టిన పన్నుల నుంచి మన వాటాగా కేంద్రం ఇవ్వాల్సింది ఇచ్చిందే తప్ప, అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టంచేశారు. రాష్ర్టాలు పన్నులు కట్టకుంటే కేంద్రానికి ప్రత్యేకంగా పైసలు ఆకాశం నుంచి వస్తున్నాయా? అని విమర్శించారు.
బీజేపీ పాలనలో బ్యాంకులు అంటేనే ప్రజలు భయపడుతున్నారని, ఎప్పుడు ఏ బ్యాంకు మూతపడుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. ఇక్కడ ఉన్న వారంతా తెలంగాణ బిడ్డలేనని, అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నామని ఆయన చెప్పారు.