భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ హంగామా ఓ వైపు. మరో వైపు చంద్రబాబునాయుడు,నారా లోకేష్ లు పెట్టుబడుల వేట అంటూ విదేశీ పర్యటనలు. తాజాగా చైనా పర్యటనలో మంత్రి నారా లోకేష్ అండ్ టీమ్ ఒప్పందం చేసుకున్న ఓ కంపెనీ తీరుచూస్తే అవాక్కు అవుతారు.లోకేష్, విజయానంద్ లు ‘హాగ్జిన్ గ్గిజన్ రుయి కమ్యూనికేషన్ టెక్నాలజీ గ్రూపు (హెచ్ సీటీజీ)తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో పెట్టారు. అయితే ఈ కంపెనీ వివరాలను తెలుసుకునేందుకు ‘తెలుగు గేట్ వే. కామ్’ ప్రయత్నించింది.విచిత్రం ఏమిటంటే ఈ సంస్థకు కనీసం వెబ్ సైట్ కూడా లేదు.ఈరోజుల్లో చిన్న కంపెనీలే ఆకర్షణీయంగా తమ వెబ్ సైట్లు రూపొందించుకుంటున్నాయి.
భారత్ లో ఈ కంపెనీ 2100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకుందని తెలిపారు.ఒక్క సప్లయిర్స్ లిస్టులో మాత్రమే కంపెనీ వివరాలు ఉన్నాయి. పోనీ అసెంబ్లీని వదిలేసి మరీ పెట్టుబడుల సాధనకు వెళ్లిన లోకేష్ కు నిర్ధిష్టంగా ఏమైనా పెట్టుబడి హామీలు వచ్చాయా? అంటే అదీ లేదు.హెచ్ సీటీజీతోపాటు చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ కంపెనీ (సీఈటీసీ) తదితర కంపెనీలతో నారా లోకేష్ చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.