తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి మండలం రమణక్క పేటలో ఆదివారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సెజ్కు ఇచ్చిన భూముల్లో సాగు చేసేందుకు రైతులు వెళ్లారు.భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా సెజ్ భూముల్లోకి వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తాము అధికారంలోకి వస్తే ఈ భూములను రైతులకు అప్పగిస్తామని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు చెప్పారని ఈ సందర్భంగా రైతులు గుర్తుచేశారు. ఇచ్చిన మాట తప్పి బాబు తమను మోసం చేశారని ఆందోళన చేశారు.భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కూడా తమకు చెల్లించలేదని రైతులు వాపోతున్నారు.
పొన్నాడ శివారు రావివారుపోడు, రమణక్కపేటకు చెందిన సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు బావిశెట్టి నారాయణస్వామి, పెనుమల్లు సుబ్బిరెడ్డి తదితరులతో పాటు సీపీఎం రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏవీ నరసింహం, సీపీఎం జిల్లా కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్, సీపీఎం నేత కూరాకుల సింహాచలం, వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేసి అన్నవరం, పిఠాపురం, కొత్తపల్లి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా తమ భూములు తమకిచ్చేయాలంటూ ఓ రైతు పోలీసు కాళ్లపై పడ్డాడు. 1983 భూసేకరణ చట్ట ప్రకారం కాకుండా.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమైనా తమకు పరిహారం ఇవ్వాలని వారు వేడుకున్నారు.
అనంతరం మొత్తం 147 మందిని పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సెజ్ ప్రాంతాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లో ఉన్నందున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు.
సెజ్ రైతులకు మద్దతు తెలిపేందుకు పిఠాపురం నుంచి వస్తున్న వైఎస్సార్సీపీ పిఠాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు, వైఎస్సార్ సీపీ కొత్తపల్లి మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్తో పాటు పలువురిని నాగులాపల్లిలో అరెస్ట్ చేసి తిమ్మాపురం పోలీస్స్టేషన్కు తరలించారు.