తెలంగాణలో టీడీపీ చచ్చిపోయిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. టీఆర్ఎస్ అవిర్భవించినప్పుడే టీడీపీ పతనం ప్రారంభమైందని తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో దేవరకొండ, మహబూబ్నగర్ టీడీపీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పిన కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ప్రసంగించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతోనే టీడీపీ అంతర్ధానం అయిందన్నారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో అజేయ శక్తిగా ఎదిగిందని మంత్రి అన్నారు. 85 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తదని ఎన్డీటీవీ సర్వే చెప్పిందని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ 150 స్థానాలకు పోటీచేస్తే ఒకే స్థానం దక్కిందన్నారు.తలాపున కృష్ణా పారుతున్నా తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు.. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పాపం ఎవరిదో మీకే బాగా తెలుసు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథ చేపట్టాం. తెలంగాణలో ఉన్న ప్రతీ ఒక్కరు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలి. రైతుకు 8 వేల పెట్టుబడి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అని మంత్రి స్పష్టం చేశారు.