కేటీఆర్ మాటలకు పూర్తిమద్దతునిస్తున్న కాంగ్రెస్ నేతలు..టీఆర్ఎస్ పార్టీ యువనేత, అపద్ధర్మ మంత్రి కేటీఆర్ తమ రాజకీయ ప్రత్యర్థిపై సెటైర్లు వేశారు. ఇటు బీజేపీని అటు కాంగ్రెస్ను కలిపి విమర్శించారు. అయితే, మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు కాంగ్రెస్లోని కొందరు నేతలు సైతం నర్మగర్భంగా మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్ కామెంట్తో అయినా తమా పార్టీ మారతుందేమో అనే ఆలోచన కాంగ్రెస్ నేతలకు వచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని పలువురు అంటున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన నేపథ్యం, ఆయన విమర్శలు గుప్పించిన క్రమంలో వేములవాడలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. పాడిందే పాడరా అన్నట్టు అమిత్షా కరీంనగర్లో మాట్లాడారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. “రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదు. రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రం లేదు. కేంద్రానికి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పన్ను తెలంగాణ నుండి కడుతున్నాం. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన దాని కంటే ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్న IT రంగంలో, విద్యుత్ రంగంలో సమస్యలు పరిష్కారం చేసుకున్నాం“ అని వివరించారు. “అమిత్షాను సవాల్ చేస్తున్నా. రాం మందిర్ పేరుతో మతాల మధ్య చిచ్చు పెట్టి, కనీసం రాం మందిర్ కూడా కట్టలేదు. అన్ని మతాల వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదరిస్తుంది. నిజమైన సెక్యులర్ పార్టీ, దేశానికి ఆదర్శం మా టీఆర్ఎస్“ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలను బీజేపీ కేంద్ర మంత్రులు చూసి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తామన్నారని కేటీఆర్ గుర్తుచేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్పై సెటైర్లు వేశారు. “కాంగ్రెస్ వాళ్లు సీట్ల పంపిణీ చేసే లోపు మేము స్వీట్ల పంపిణీ చేసుకుంటాం” అని కేటీఆర్ అన్నారు. కాగా, తమ అభ్యర్థుల ఖరారు విషయంలో సుదీర్ఘ జాప్యం జరగడం చూస్తుంటే… ఇదే నిజమన్నట్లుగా ఉందని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అనూహ్యంగా కాంగ్రెస్ నేతలు కేటీఆర్కు మద్దతివ్వడం చిత్రంగా ఉందంటున్నారు.