సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళుతున్నారంటే అందుకు సంబంధించిన ఎజెండా ముందుగానే ప్రకటిస్తారు. ఈ విధానాన్ని అందరూ పాటిస్తారు. ఇక ప్రచారాన్ని ఓ రేంజ్లో ఇష్టపడే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఎందుకోసం ఢిల్లీ వెళుతున్నారు? వంటి వివరాలను ముందుగా వెల్లడించేవారు. విచిత్రమేమంటే ఈసారి వాటన్నింటికీ భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ వెళ్లారు.
అయితే, అక్కడ ఆయనకు పరాభవం తప్పలేదని పలువురు పేర్కొంటున్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీ భవన్లో విపక్షాల నేతలతో సమావేశం జరపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దేశ రాజధానికి చేరుకున్నారు. ముందుగా బాబు వేసుకున్న లెక్కలు వేరుకాగా…ఢిల్లీలో జరిగింది మరొకటి. విపక్ష నేతలందరినీ కలవాలని చూస్తే కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జేడీయూ శరద్ యాదవ్ మాత్రమే బాబుతో సమావేశం అయ్యారు.
ఇక దీనికి కొనసాగింపుగా మరో షాక్ తగిలిందని కూడా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కొన్ని తెలుగు ఛానెల్స్ మినహా జాతీయ ఛానెల్స్ లైవ్ ప్రసారములు ఇవ్వలేదని అంటున్నారు. స్థూలంగా పార్టీ శ్రేణులకు బాబు ఢిల్లీ టూర్తో తీవ్ర నిరాశ కలిగిందని చెప్తున్నారు. తన స్వంత నియోజక వర్గం కుప్పం పర్యటనను రద్దు చేసుకుని మరీ ఢిల్లీ వెళ్లి నప్పటికి పెద్దగా ప్రయోజనం నెరవేరలేదని ఆ పార్టీ నేతలే వాపోతున్నట్లు సమాచారం.