తెలంగాణలో తమ సత్తా చాటుతామని, అవసరమైతే అధికారంలోకి వస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నేతలు..పట్టు కంటే ముందు పార్టీ కార్యాలయాలను కాపాడుకోవాల్సి వస్తోంది! టీఆర్ఎస్ తరువాత అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం జరిగినా రెండవ జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపులతో అసంతృప్తులు బైటపడుతున్నాయి. ఏకంగా పార్టీ కార్యాలయంపైనే విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే బీజేపీ అభ్యర్థుల జాబితాను ఇవాళ విడుదల చేశారు.
28 స్థానాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ఇవాళ బీజేపీ తన ట్విట్టర్లో పోస్టు చేసింది.
దీనిలో భాగంగా శేరిలింగంపల్లి టిక్కెట్ను యోగానంద్కు, నిజామాబాద్ అర్బన్ టిక్కెట్ను యెండల లక్ష్మీనారాయణకు రాష్ట్ర అధిష్టానం జాబితా మేరకు కేంద్ర అధిష్ఠానం కేటాయించింది. దీంతో ఈ రెండు స్థానాల్లో టిక్కెట్ల ఆశించి భంగపడిన నేతలు ఆందోళనకు దిగారు. శేరిలింగంపల్లి టిక్కెట్ను యోగానంద్కు కేటాయించడంపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నరేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనను కాదని.. మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన బిల్డర్ యోగానంద్కు టిక్కెట్ ఎలా కేటాయిస్తారంటూ పార్టీ పెద్దలను నిలదీశారు.
దీనికి నిరసనగా హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఎదుట మద్దతుదారులతో కలిసి ఆయన నిరసనకు దిగారు.
శేరిలింగంపల్లి టిక్కెట్ను తనకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.మరోవైపు నిజామాబాద్ అర్బన్ టిక్కెట్ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించడంపైనా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యెండలకు టిక్కెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ సూర్యనారాయణ గుప్తా అనుచరులు ఆందోళన చేపట్టారు. భాజపా కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కాగా, పార్టీలో విబేధాలు బైటపడటంతో వారిని బుజ్జగించేందుకు పెద్దస్థాయి నేతలు ప్రయత్నిస్తున్నారు. అయినా ఊరట చెందని అసంతృప్తి నేతలు తమ నిరసనను పార్టీ కార్యాలయాలపై వ్యక్తంచేస్తున్నారు.