ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కే ఓటేస్తానని ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి స్పష్టం చేశారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆంధ్రావాసులు చంద్రబాబు మాటలను నమ్మొద్దు.. బాబు లాంటి మోసగాడు దేశంలో మరొకరు లేరు. ఆయన మాటలను నమ్మి టీడీపీకి ఓటేస్తే మరో యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని పోసాని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్.. ఇవాళ ఉదయం పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వ్యవధిలోనే సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఉత్తమమైన పాలన అందిస్తున్నారు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం నిజాలు చెప్పరు.. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది అని చంద్రబాబుకు శాపం ఉందన్నారు. అవకాశవాద రాజకీయాల కోసం ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న నాయకుడు దేశంలో చంద్రబాబు తప్ప మరొకరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని.