టీఆర్ఎస్ ఇంకా సంతోషపడేది నెల రోజులే` ఇది టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవా. సోమవారం కోదండరాం తన పార్టీ గుర్తు ప్రకటించిన సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ టీఆర్ఎస్ ఇంకా సంతోషపడేది నెలరోజులే అని అన్నారు. చెత్తను కాల్చాలన్నా.. హారతి పట్టాలన్నా అగ్గిపెట్టే ముఖ్యం. ఖచ్చితంగా పుల్లలు పెడతాం.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరేవరకు మా పని అదే అని కోదండరాం తెలిపారు. సీట్ల విషయమై సాయంత్రంలోపు కొలిక్కి వస్తుందన్నారు. కాగా, సాయంత్రం వరకు ఎదురుచూసిన కోదండరాంకు షాక్ తగిలినట్లు సమాచారం. పార్క్ హయత్ హోటల్లో కాంగ్రెస్ కోర్ కమిటీ నేతలతో భేటీ అయిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మధ్యలోనే వాకౌట్ చేసినట్లు పలు మీడియాల్లో ప్రచారం జరిగింది.
పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా నలుగురు ఏఐసీసీ సెక్రటరీలు, పార్టీ సీనియర్ నేతలు. మల్లు భట్టి విక్రమార్క, మధు యాస్కీ గౌడ్ సమావేశం అయ్యేందుకు సిద్ధమవగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమావేశానికి హాజరు కాలేదు. తమ సీట్ల విషయంలో కొంత స్పష్టత ఉన్న కారణంగా హాజరుకాబోమని ఎల్ రమణ వెల్లడించారు. చర్చలకు తమకు ఇంకా ఆహ్వానం అందలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి వెల్లడించారు. కానీ ఈ సమావేశానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాత్రమే హాజరయ్యారు.అయితే, కోదండరాం ఊహించిన విధంగా కాంగ్రెస్ స్పందించని నేపథ్యంలో ఆయన వాకౌట్ చేసినట్లు పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది.
దీంతో… టీఆర్ఎస్కు దూరం కానున్న సంతోషం గురించి కోదండరాం స్పందించడం కంటే..ముందుగా తనకు జరుగుతున్న పరాభవం గురించి ఆలోచించుకోవాలని పలువురు అంటున్నారు. కూటమిలోని సీపీఐ, టీడీపీ నేతలు హాజరుకాకుండా దూరంగా ఉన్నప్పటికీ…కాంగ్రెస్ మీటింగ్కు వెళ్లిన కోదండరాంకు ఆ పార్టీ నేతలు తగిన రీతిలో జవాబిచ్చిన తీరు, కోదండరాం సంతోషం ఆవిరైన విధానం గురించి స్పందించాలని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.