`కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్లకు సిద్ధాంతాలు లేవు. అవకాశవాద రాజకీయాల కోసం అంతా ఒక్కటయ్యారు. పదవుల కోసం సిద్ధాంతాలు పక్కన పెట్టారు. సిద్ధాంతాలకు తక్కువ.. రాద్ధాంతాలకు ఎక్కువగా మహాకూటమి మారింది` అని టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి హరీష్రావు విమర్శించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతో దోస్తీ కట్టి.. తెలంగాణకు టీజేఎస్ ద్రోహం చేస్తోందని అన్నారు. ఆంధ్ర నాయకత్వం ముందు తెలంగాణను కోదండరాం తాకట్టు పెట్టారని విమర్శించారు.
కోదండరాంను కాంగ్రెస్ ఛీ కొడుతున్నా.. టికెట్లు కావాలంటూ ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 11వ తేదీన గల్లంతయ్యే కూటమి మహాకూటమి అని ఆపద్ధర్మ మంత్రి హరీష్రావు అన్నారు. మహా కూటమి ఆఫీస్ ఢిల్లీలో ఉందా లేక అమరావతిలో ఉందా అని ప్రశ్నించారు. ‘కన్ను కొట్టే సిద్ధాంతం రాహుల్ ది, రెండు కళ్ల సిద్ధాంతం చంద్రబాబు నాయుడుది’ హరీష్ ఎద్దేవా చేశారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా తమదే విజయమని హరీష్ అన్నారు.బీజేపీలో పనిచేసే కార్యకర్తలకు స్థానం లేదని.. రియలెస్టేట్, విజయ మాల్యా దోస్తులకు టికెట్లు ఇస్తున్నారని హరీష్ విమర్శించారు. ‘అమిత్ షా వచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నాం అంటారు. కానీ.. బీజేపీ నుంచి రోజుకొక్కరు బయటకు పోతున్నారు. ఒకసారి వెనక్కి చూసుకోండి. ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి’ అని బీజేపీ నేతలకు సూచించారు.