కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాను అన్న సామెత ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సరిపోతుందని పలువురు సెటైర్లు వేస్తున్నారు. అనుభవజ్ఞుడని నమ్మి రాష్ర్టాన్ని చేతిలో పెడితే నాశనం చేసిన తీరును ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నోరు తెరిస్తే…తెలంగాణను ఉద్దరించానని చంద్రబాబు చెప్పుకొనే సంగతి తెలిసిందే. హైదరాబాద్ అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు తీరుపై పలువురు సహజంగానే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.“హైదరాబాద్ అభివృద్ధిపరిణామక్రమంలో అభివృద్ధి జరిగిందే తప్ప, ఆయన చేసిందేమిలేదు. అమరావతి నిర్మాణానికి ఇటుకలు వేయడం ఎందుకో చేతకాలేదు? తాత్కాలిక సచివాలయ భవనంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో, వర్షానికి నీళ్లు వచ్చి డాక్యుమెంట్లు ఎలా తడిచాయో? కిటీకీలు ఊడిపోయాయో ప్రజలకు తెలుసు.“ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
కూటమిని వెనకుండి నడిపిస్తున్న చంద్రబాబు ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వాములయ్యారు. నాలుగేండ్లపాటు కేంద్ర మంత్రివర్గంలో పదవులు అనుభవించారు. కాంట్రాక్టులు పొంది డబ్బులు సంపాదించారే తప్ప.. తమ రాష్ర్టానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవడం, అత్యవసర సందర్భా ల్లో అవసరమైన సాయం తెచ్చుకోవడం చేతకాలేదు. కేంద్రంలో అధికారం అనుభవించినంతకాలం ప్రత్యేక హోదా అడిగితే జైలు లో పెడుతానని హెచ్చరించారు. హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్నారు. ప్రజల్లో తమ సీన్ రివర్స్ అవుతున్నదన్న అనుమానం రాగానే ఎన్నికలకు ఏడాది ముందు కొత్త డ్రామా మొదలుపెట్టా రు. ప్రధాని సహకరించడం లేదంటూ పదవులు వదులుకున్నారు. జైలులో పెడుతా అన్న నోటితోనే హోదాకు జై అన్నారు. ఇలాంటి యూటర్న్ వ్యాఖ్యలతో తెలుగు సమాజం నిజంగా సంభ్రమాశ్చర్యాలకు లోనైంది.
తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని మరిచి, పక్కరాష్ట్రంలో అభివృద్ధిని అడ్డకునేందుకు సిద్ధపడి ఎన్నికల్లో నిలుస్తున్న నేతలకు తెలంగాణ ప్రజలు చివరికి సంభ్రమాశ్చర్యాన్నే మిగుల్చుతారని వ్యాఖ్యానిస్తున్నారు.