ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ మరో కీలకనిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఆదివారం రామమందిర నిర్మాణం చేయాలనే డిమాండ్తో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ధర్మసభ నిర్వహించగా….మరో వైపు అయోధ్యలో అతి ఎత్తైన రాముడి విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో యోగి బిజీగా ఉన్నారు. “స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్” పేరుతో రాముడి విగ్రహాం నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి శనివారం ఖరారు చేశారు. గుజరాత్ లో నర్మదానది ఒడ్డున నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం(182 మీటర్ల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) కంటే ఎత్తుగా 221 మీటర్ల ఎత్తులో యోగి ప్రభుత్వం దీన్ని నిర్మిస్తోంది.
విగ్రహం పునాది 50 మీటర్లు, విగ్రహం ఎత్తు 151 మీటర్లు, దానిపై ఉండే గొడుగు 20 మీటర్లు ఉండేలా విగ్రహాన్నిడిజైన్ చేశామని, ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడం అవుతుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ముఖ్యకార్యదర్శి అవనీశ్ అవస్ధి చెప్పారు. విగ్రహం కింద ఇక్ష్వాకు వంశ చరిత్రకు సంబంధించిన విశేషాలతో అధునాతన మ్యూజియం ఏర్పాటు చేస్తామని అవస్ధి చెప్పారు. సరయూ నది ఒడ్డున నిర్మించే రాముడి కాంస్యవిగ్రహం చుట్టుపక్కల పర్యాటక రంగం అభివృధ్ది చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అవనీశ్ అవస్ధి తెలిపారు.