తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో నివసిస్తున్న వివిధ సంఘాల నేతలు మద్దతుతెలుపుతున్న పరంపరలో మరో కీలక పరిణామం జరిగింది. గులాబీ అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జీఆర్టీఏ) మద్దతు ప్రకటించింది. సుస్థిర పాలన అందించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని జీఆర్టీఏ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ హన్మంతరెడ్డి స్పష్టం చేశారు. విభజన తర్వాత రాయలసీమకు అన్యాయం చేస్తున్న టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడికి రక్షణ కల్పించలేని అక్కడి ప్రభుత్వం తెలంగాణలో నివాసం ఉంటున్న రాయలసీమ వాసులకు ఏం రక్షణ కల్పిస్తుందని మండిపడ్డారు.
తాజాగా, హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ హన్మంతరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు కుట్రలో భాగంగా ఏర్పడిన మాయా కూటమి వల్ల ప్రాంతీయ విద్వేషాలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నామని చెప్పారు. స్వేచ్ఛగా ఉద్యోగాలు, వ్యాపారాలు సాగిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించాలని తామంతా నిర్ణయించినట్లు ప్రతినిధులు తెలిపారు.