ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోని ప్రభుత్వం ఉత్సవాలకు,ఈవెంట్స్ కు మాత్రం కోట్ల రూపాయలు వృధా చేస్తుంది.నగరంలో ఏదైనా సదస్సు జరిగినా, ప్రముఖులు వచ్చినా జీవీఎంసీ కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల పంట పండినట్లే. సుందరీకరణ పేరుతో వీరంతా దొరికినంత దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా రు. ఏదైనా ప్రధాన కార్యక్రమం జరిగితే చాలు అందరి చూపూ డివైడర్లకు రంగులు, ఫుట్పాత్లకు హంగులపైనే ఉంటుంది. వెంటనే టెండర్లు పిలవడం..బిల్లులు పాస్ చేసుకొని…రంగులు వేసెయ్యడం.. ఖజానా సొమ్ముని జేబుల్లో వేసుకోవడం… రెండేళ్లుగా గ్రేటర్లో ఇదే దందా సాగుతోంది. తాజాగా విశాఖ ఉత్సవ్ పేరుతో మరో ప్రహసనానికి తెరతీస్తోంది.
విశాఖ ఉత్సవ్ పేరుతో ఏటా సాగరతీరంలో దుబారా ఉత్సవాలను సర్కారు నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు సాగే ఈ ప్రహసనానికి ప్రభుత్వ విభాగాల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. ఈ ఉత్సవ్కు ఏటా స్పందన అంతంతమాత్రమే. వివాదాల నడుమ నడుస్తూ.. దేశ విదేశీ పర్యాటకులు రాని సమయంలో నిర్వహించడంతో ఓ ఉత్తుత్తి ఉత్సవ్లా మారిపోయింది. అలాంటి ఉత్సవానికి జీవీఎంసీ ఖజానా నుంచి ఏటా రూ.కోటి వరకూ ఖర్చు చేయిస్తున్నారు. పెయింటింగ్స్కు రూ.60 నుంచి రూ.70 లక్షలు, విద్యుత్ వెలుగులకు రూ.30 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటిని కార్పొరేషన్ సమర్పిస్తోంది.అయితే ఈ మేరకు 2016 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగినప్పుడు ఫుట్పాత్లు, డివైడర్లకు రంగులు వేశారు.
ఆ తరువాత ఆరు నెలకే బ్రిక్స్ సదస్సంటూ సెప్టెంబర్లో మళ్లీ రంగులేశారు.ఈ ఏడాది మేలో జరిగిన తెలుగుదేశం మహానాడు సమయంలో అదేదో ప్రభుత్వ ఘన కార్యక్రమమంటూ లక్షలాది రూపాయలు తగలేసి తెలుపు, పసుపు రంగులు వేసి జీవీఎంసీ అధికార యంత్రాగం సర్కారుపై వీర విధేయతను చాటుకుంది.ఇలా ఏదోకటి చెప్పుకుంటూ ఎప్పుడంటే అప్పుడు సర్కారు ఆదేశించడం.. జీవీఎంసీ సిబ్బంది రంగులు వేయించేయడం జరుగుతోంది.ఈ ప్రభుత్వాని అడిగేవాడు లేడు..ఒకవేళ ఎవరైనా ఎదురించి ప్రశ్నిస్తే అధికార పార్టీ వాళ్ళని అనిచివేస్తుంది.