2018 సంవత్సరం మరికొద్దిరోజుల్లో పూర్తి కావస్తోంది. 2018కల్లా పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు పోలవరం సహా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 20శాతం కూడా నెరవేరలేదంటే ఆయన పాలన ఎంత అధ్వాన్నమో అర్థం చేసుకోవచ్చు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా దీక్షలు, కడప స్టీలుప్లాంటు విషయంలో కేంద్రం నుంచి అనుమతులు, రైల్వేజోన్ వంటి అతి ముఖ్యమైన విషయాల్లోనూ చంద్రబాబు ఒక్కచోట కూడా సఫలం కాలేదు. విదేశీ ప్రయాణాలు కూడా ఎప్పటిలానే ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ఇప్పటికే పునాదులు, శిలాఫలకాలు పడ్డ ఏ ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో పూర్తవలేదు. స్మార్ట్ సిటీల సంగతి ఏమైందో ఎవరికీ తెలియదు. నీళ్లున్న చోటల్లా ఓడరేవు, జిల్లాకో ఎయిర్ పోర్టులూ ప్రారంభం కాలేదు.
రాజధానిలో ఎలాంటి ప్రగతీ లేదు. కనీస మౌలిక వసతుల కల్పన కూడా లేదు. ఏ జిల్లాలోనూ ఉపాధి అవకాశాలు పెంచే పరిశ్రమల స్థాపన కూడా రాలేదు. కోనసీమకు కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ, శ్రీకాకుళం టెక్స్ టైల్ పార్కు, కృష్ణాజిల్లాలో ఫుడ్ పార్కు, కర్నూలు లో మెగా సీడ్ పార్కు ఇలా ఎక్కడా వీటి ఆనవాళ్లు లేవు. మూడేళ్లుగా ఊరించి ఏడాది చివర్లో ముష్టిలా వేసిన 12000 పోస్టుల డీఎస్సీ బోలెడన్ని లిటిగేషన్లతో ఉంది. సుప్రీం మొట్టికాయలతో తప్పనిసరిగా జనవరిలో హైకోర్టును తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ, వ్యాపార రంగాలన్నీ దారుణంగా కుదేలవగా.. ఎక్కడా అభివృద్ధి జాడ కనిపించట్లేదు ఫలితంగా నారావారి నామాల యేడాదిగా 2018 మిగిలిపోయింది.