మొత్తం 341 రోజులు.. 3,648 కిలోమీటర్లు.. ప్రతి పల్లెను పలుకరిస్తూ.. కోటి 25 లక్షల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ వారితో మమేకం…తెలుగు గడ్డపై కనీవినీ ఎరుగని ఇలాంటి పాదయాత్ర చరిత్రలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్ఆర్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’ ఈనెల 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. అప్పటికి ఈ అపూర్వ పాదయాత్ర 3,648 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది.
రాష్ట్రంలోని దాదాపు 2,516 గ్రామాల మీదుగా సాగే ప్రతిపక్ష నేత పాదయాత్రలో బుధవారం నాటికి 124 బహిరంగ సభలు (ఇప్పటికి 123 సభలు) పూర్తవుతాయి.మొత్తంగా చూస్తే 1.25 కోట్ల మందికిపైగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారితో మమేకమై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగించిన ఈ పాదయాత్ర ఓ అరుదైన ఘట్టంగా చరిత్రపుటల్లోకెక్కనుంది. మరోపక్క ఆత్మీయ సమావేశాలకూ వేలసంఖ్యలో ఆయా వర్గాల ప్రజలు హాజరయ్యారు. వీరితో పాటు ప్రసారమాధ్యమాల ద్వారా పాదయాత్ర, బహిరంగ సభలను వీక్షించిన దేశ విదేశాల్లోని కోట్లాది తెలుగు ప్రజలందరినీ కలుపుకొంటే ఈ సంఖ్య భారీగానే ఉండనుంది.
ముగింపురోజు నాటికి పాదయాత్ర గ్రామాల సంఖ్య 2,516కి చేరనుంది. 231 మండల కేంద్రాలు, 54 మున్సిపాలిటీలు, 8 నగరాలు, మహానగరాల మీదుగా సాగిన జగన్ పాదయాత్రకు జనం అడుగడుగునా వెల్లువెత్తారు. ప్రతిపక్షనేతను కలసి సమస్యలు చెప్పుకునేందుకు, టీడీపీ సర్కారు అరాచకాలు, అక్రమాలు, అవినీతిని వివరించేందుకు ప్రతిపక్ష నేతను కలిసేందుకు బారులుతీరారు. ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీపడ్డారు. వృద్ధులు, యువత, మహిళలు, విద్యార్ధులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, చిరుద్యోగులు, వివిధ సామాజికవర్గాల ప్రతినిధులు, కర్షకులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్ను కలిసేందుకు కదలి వచ్చారు. పాదయాత్ర గ్రామాల మీదుగా సాగినప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు పరుగు పరుగున వచ్చిన దృశ్యాలు అనేకం.
పట్టణాలు, నగరాల్లో ప్రతిపక్ష నేతను అనుసరిస్తూ పాదయాత్రలో మమేకమైన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. ప్రతిపక్ష నేతను కలిసేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. మేడలు, మిద్దెలు ఎక్కి వైఎస్ జగన్ను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు జనం పోటెత్తారు. తమ ప్రియతమ నాయకుడు, ప్రతిపక్ష నేతను కళ్లారా తిలకించి ఆయన ప్రసంగాన్ని వినేందుకు పోటెత్తిన జనంతో బహిరంగ సభలు జనసంద్రంలా మారాయి. పాదయాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించినప్పుడు కనకదుర్గమ్మ వారధి జనప్రవాహంతో నిండిపోయింది. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోకి యాత్ర చేరుకున్నప్పుడు రాజమండ్రి వద్ద గోదావరిపై ఉన్న రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి జనవారధిగా మారింది. విశాఖలో కంచరపాలెం వద్ద జరిగిన సభ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది.