వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోగించిన యాత్రాభేరి నలుదిశలా ప్రతిధ్వనిస్తూ ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ సంకల్పం ఎన్ని అవరోధాలెదురైనా వెనుతీయని ఉత్తుంగ తరంగంలా ముందుకు ఉరుకుతూ పతాక స్థాయికి చేరింది. ప్రజాసంకల్ప యాత్ర గురి మున్ముందుకు సాగి ముగింపు దశకు చేరుకుంది. ఆయన అడుగులో అడుగు వేసి ప్రజాసేవలో పాలుపంచుకోవడానికి వీలుగా వైయస్ఆర్సీపీలో చేరిన రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వివిధ రంగాల ప్రముఖుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంది. ఈ పరిణామం పచ్చదళం గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది.
జగన్ కు వచ్చిన ఆదరణ టీడీపీని హడలెత్తిస్తోంది. తాజాగా సినీ హీరో భాను చందర్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో ఇప్పటికే సినీ నటులు రోజా క్రియాశీలంగా ఉన్నారు. ఇంకా అనేక మంది నటులు పార్టీలో ఉన్నారు. పాదయాత్రలో సినీ రంగానికి చెందిన కృష్ణుడు, ప్వధ్వీ, పోసాని కృష్ణమురళి ఇలా అనేక మంది జననేతకు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో జగన్ పట్టుదల, పోరాట పటిమ, ప్రజలకు సేవ చేయాలనే తపన నచ్చే తాను వైసీపీ లో చేరుతున్నట్టు భాను చందర్ ప్రకటించారు. మరో ఇరవయ్యేళ్లు జగనే సీఎంగా ఉంటారని భాను చందర్ అన్నారు.