తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలుకానుంది. వచ్చే ఫిబ్రవరీ నెల మూడోవారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగనున్నది. ఇందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఖాళీ అయిన, త్వరలో ఖాళీ కాబోతున్న స్థానాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా, ప్రతి రెండేండ్లకోసారి మూడోవంతు స్థానాలు ఖాళీ అవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం వాటికి ఎన్నికలు నిర్వహించి ఆయా స్థానాలను భర్తీ చేస్తుంది.
ఈ ఏడాది మార్చి 29నాటికి ఎనిమిది, మే 1నాటికి ఒక ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాచేశారు. వరంగల్ స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీగా గెలిచిన కొండా మురళి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి పదవికి రాజీనామాచే శారు. మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలు మండలిలో ఖాళీగా ఉండబోతున్నందున భర్తీ ప్రక్రియను ఈసీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి మూడోవారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి రెండోవారంనాటికి ప్రక్రియను ముగించాలని భావిస్తున్నది. ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తయ్యే పదిరోజుల ముందుగానే కొత్త ఎమ్మెల్సీల ఎంపిక కూడా ముగుస్తుంది.
13 స్థానాల ఎన్నిక విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చినప్పటికీ మరో మూడుస్థానాల్లో మాత్రం స్పష్టతరాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన రాములునాయక్, ఆర్ భూపతిరెడ్డి, కే యాదవరెడ్డి సభ్యత్వాలను రద్దు చేయాలని టీఆర్ఎస్ ఇటీవల శాసన మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసింది. ఫిరాయింపుల చట్టం ప్రకారం ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంటే మరో మూడుస్థానాలు ఖాళీ అవుతాయి. దీంతో ఇప్పటికే ఉన్న 13 స్థానాలకు ఈ మూడుస్థానాలు కలిపి 16 స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కాగా, వీటిలో మెజార్టీ సీట్లు టీఆర్ఎస్ గెలుచుకోనుందని రాజకీయవర్గాలు జోస్యం చెప్తున్నాయి.