ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేత ఒకరు గుడ్ బై చెప్పడం ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. టీఆఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్పై రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్రెడ్డి టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒంటేరు టీఆర్ఎస్లో చేరబోతున్నారని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతాప్రెడ్డి సంచలన ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై 50 నుంచి 60 వేల మెజారిటీతో గెలబోతున్నానని ప్రతాప్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఆయనకు ఓటమి తప్పలేదు. కాగా, ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
కాగా, టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఒంటేరు ప్రతాప్రెడ్డి ఆ పార్టీకి 2018 మార్చిలో గుడ్బై చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాసి మల్లన్నసాగర్ బాధితులకు అండగా పోరాటం, ఓయూలో విద్యార్థి మురళి ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సందర్భంలో ప్రభుత్వం తనపై కక్ష గట్టి అక్రమ కేసులతో జైలుకు పంపిందని, అయితే ఈ పోరాటాల్లో టీడీపీ తెలంగాణ నాయకత్వం తనకు అండగా నిలవకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి బరిలో దిగి ఓడిపోయారు. కాగా, ఒంటేరు చేరికతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగలడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు.