తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై సిరిసిల్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం కావడం, పోచారం స్పీకర్ కావడం రాష్ర్టాభివృద్ధికి శుభపరిణామం అని అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులంతా సంబురపడుతున్నారడంలో అతిశయోక్తి లేదన్నారు. పోచారం పనితీరును మెచ్చుకున్న కేసీఆర్ ఆయనకు స్వయంగా లక్ష్మీపుత్రుడిగా నామకరణం చేశారు.
రాష్ట్రంలో రెండో హరిత విప్లవానికి కూడా పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బీజం పడింది అనడంలో ఎలాంటి అతిశయెక్తి లేదు. రూ.17 వేల కోట్ల రైతురుణమాఫీ చేయడం, 58 లక్షల మంది రైతులకు రైతుబంధు, 38 లక్షల మంది రైతులకు రైతుబీమా ద్వారా భరోసా కల్పించిన ఘనత పోచారం శ్రీనివాస్ రెడ్డిదే అని కేటీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు. 4,200 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను పోచారం సారథ్యంలో నియమించారు. వ్యవసాయంలో పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా కొత్త పుంతలు తొక్కించారు. ఇవన్నీ కూడా పోచారం శ్రీనివాస్రెడ్డి హయాంలో జరిగిన కార్యక్రమాలు.. ఈ కార్యక్రమాలన్నీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు కేటీఆర్.
పోచారం శ్రీనివాస్ రెడ్డి తన వయసును లెక్క చేయకుండా ప్రజలతో సన్నిహితంగా, సత్సంబంధాలు పెట్టుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. నిత్య విద్యార్థి మాదిరిగా పోచారం శాసనసభలో ఉండిపోయేవారు. ఇది మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఆదర్శం. ఒకనాడు పద్దుల చర్చ సందర్భంగా రాత్రి ఒంటిన్నర గంట వరకు అసెంబ్లీ జరిగింది. ఆ సమయంలో వ్యవసాయ పద్దు మీద పోచారం సమాధానం ఇస్తున్నారు. ప్రశ్నలు అడిగిన ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా అక్కడ లేరు. సమాధానాన్ని ఉపక్రమించగానే.. సభ్యులు ఎవరూ లేరు అని కొందరు అనడంతో… హాస్య చతురతతో పోచారం సమాధానం ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. సభలో ప్రశ్నలు అడిగిన వారు లేకున్న వారు తమ నివాసాల్లో టీవీల్లో చూస్తుంటారు అని.. వారికి సమాధానం చెప్పాల్సిందేనని ఓపికగా సమాధానం చెప్పారని కేటీఆర్ తెలిపారు.
Tags kcr ktr Pocharam Srinivas Reddy slider speaker telanganaassembly trs