తెలంగాణ కాంగ్రెస్లో లుకలకలు మరోమారు బహిర్గతం అయ్యాయి. సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. కాంగ్రెస్లో కష్టపడేవారికి తగిన గుర్తింపులేదని, అందుకే చాలామంది నేతలు పార్టీ మారేందుకు సమాయత్తం అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో లాబీయింగ్, పైరవీలు చేసేవారికి పెద్దపీట వేసే దుస్సాంప్రదాయానికి పార్టీ అధిష్ఠానం స్వస్తి పలకాలని సూచించారు.
స్థానికంగా ప్రజాబలం ఉన్న నాయకులను సైతం లెక్కచేయకుండా ఢిల్లీలో తిరిగే వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పార్టీ కోసం కష్టపడే నాయకులను గుర్తించకుండా కొందరు చెప్పిన మాటలకే అధిష్ఠానం విలువనిస్తూ క్షేత్రస్థాయి పరిణామాలను గుర్తించలేకపోతున్నదని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఒంటేరు ప్రతాప్రెడ్డి పార్టీ మారడం సమంజసమైన నిర్ణయమని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ తరపున ఎంతో పోరాటంచేసిన వ్యక్తికి పార్టీ గుర్తింపు లేకపోవడం వల్ల నిరాశాకు గురికావడం సాధారణమేనని అన్నారు.
2009 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తూ వస్తున్న ప్రతాప్రెడ్డి ఆర్థికంగా చితికిపోయారని, ఉన్న ఆస్తులు అమ్ముకొని బజారునపడితే పార్టీ కనీసం ధైర్యంచెప్పలేని పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి మీద పోటీచేయడం ప్రతాప్రెడ్డి సాహసానికి నిదర్శనమని, ఆయన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా పార్టీ మారడం మంచిదేనని చెప్పారు. ఇకనైనా ప్రతాప్రెడ్డి ప్రశాంతమైన జీవితాన్ని గడిపి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో తనకు పని ఉందని, తనతోఆయనకు పని లేదని జగ్గారెడ్డి తెలిపారు.