అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన కనకదుర్గ కష్టాల్లో చిక్కుకుంది.కేరళలోని శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న 39 ఏండ్ల కనకదుర్గను ఇటీవల ఆమె అత్త కనదుర్గను చితకబాదగా.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే గెంటేశారు.మతపరమైన ఆచారాలను ధిక్కరించి అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుందన్న కారణంతో వారం కిందట కనకదుర్గపై ఆమె అత్త దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో చికిత్స కోసం కనకదుర్గను కోజికోడ్ వైద్య కళాశాలలో చేర్పించారు. అయితే తాజాగా ఆమెను అత్తింటివారు ఇంట్లోకి రానివ్వడం లేదు. దీనిపై కనకదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కనకదుర్గను తిరిగి ఇంటికి తీసుకెళ్లగా… అప్పటికే ఆమె భర్త ఇంటికి తాళం వేసి తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి ఎక్కడో వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో కనకదుర్గను ప్రభుత్వ ఆశ్రయ గృహానికి తరలించారు. శబరిమల ఆలయంలోకి 10- 50 ఏండ్లలోపు మహిళల ప్రవేశంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కనకదుర్గతో పాటు బిందు అమ్మిని అనే 40 ఏండ్ల మహిళ తొలిసారిగా శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం సంచలనం సృష్టించింది. అయితే ఆందోళనకారుల నుంచి ప్రమాదం ఉన్న నేపథ్యంలో వారిద్దరినీ కొచ్చి శివారులోని రహస్య ప్రాంతంలో కొద్దిరోజుల పాటు పోలీసులు దాచారు. అనంతరం జనవరి 15న కనకదుర్గ తిరిగి ఇంటికి వెళ్లగా ఆమెపై అత్త దాడి చేశారు. ఈ క్రమంలో కనకదుర్గతో పాటు బిందు అమ్మినికి 24 గంటలూ రక్షణ కల్పించాలని కేరళ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది.