అకాల వర్షాల కారణంగా ఇటుక బట్టీలు పూర్తిగా వరద నీటిలో మునిగి పోయాయి.దీనివల్ల బట్టీల యజమానులకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. అప్పులు తీసుకొచ్చి వడ్డీలు చెల్లిస్తూ కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఎదురు చూస్తున్న తమను అకాల వర్షాలు నట్టేట ముంచాయని ఇటుక బట్టీల యజమానులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని వారు దీనంగా వాపోతున్నారు. జి.కొండూరు మండలంలో వెల్లటూరు, కుంటముక్కల, చెవుటూరు తదితర గ్రామాల్లో సుమారు 250 పైగా బట్టీలు నడుస్తున్నాయి. ఆయా బట్టిల యజమానులు యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆయా గ్రామాల అభివృద్ధికి లక్షల రూపాయల నిధులను చెల్లిస్తూ ఇటుకలు తయారు చేసుకుంటున్నారు.
గత ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలు బట్టీల వ్యాపారుల పాలిట శాపంగా మారాయి. వర్షపు నీటిలో నాని పోయి ముద్ద ముద్ద అయిపోయాయి. కొన్ని ఇటుక బట్టీలు చెరువులను తలపిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువచ్చి వారికి లక్షల రూపాయలు అడ్వాన్స్ లు చెల్లించి ఇటుకలను తయారు చేసుకుంటే, అవి కాలేలోపు వర్షం కారణంగా వినాశనం అయిపోయాయని బట్టీల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. చేతికి అందిన శ్రమ ఫలితం నోటికి దక్కలేదంటున్నారు. తమకు ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం తమకు సరైన గుర్తింపు ఇవ్వడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ఈ ప్రాంతం ఇటుకల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తమను చిన్న పరిశ్రమల తరహాలో గుర్తించి అధికారికంగా అనుమతులు మంజూరు చేయాలని ఇటుక బట్టీల నిర్వాహకులు కోరుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు ఉంటేనే తమకు బ్యాంకులు రుణాలు ఇస్తాయని, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా నష్టం వాటిల్లినప్పుడు బీమా చెల్లించి ఆదుకుంటాయని ఇటుక బట్టీల నిర్వాహకులు కోరుతున్నారు. బట్టీల వల్ల ఎకరం కౌలు రూ.50,000 వరకు చెల్లిస్తున్నామని, దీనివల్ల ఈ ప్రాంత రైతులు కూడా ఎంతో లాభ పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఎంతో మంది కూలీలకు వలసలు పోకుండా ఉపాధి కల్పిస్తున్నామన్నారు. అకాల వర్షాల వలన నష్టపోయిన తమను ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలని బట్టీల నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.