మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇటీవల ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల మరో విషయాన్ని బయటపెట్టారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కట్టేవారని అది తెలిసి ఆగ్రహంతో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్తో చంద్రబాబుని కొట్టబోయారని నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనను చెప్పారు. కులాల కుంపటి రాజేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ ఆ ఉదంతాన్ని వివరించారు. చంద్రబాబుని అందరిలో చెన్నారెడ్డి కొట్టబోవడంతో ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదన్నారు.
ఆ తర్వాత తాను చెన్నారెడ్డి వద్దకు వెళ్లి ఎందుకు కొట్టబోయారని అడిగితే పార్టీలో ముఠాలు కడుతున్నాడు చంద్రబాబుని ఎవరూ చేరదీయకండి అని చెప్పారన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్లో చంద్రబాబు దొంగతనం చేసినట్లు కేసు ఉందని ఇది వాస్తవమన్నారు. ఇటీవల కొన్ని టీవీ చానెళ్లలో తాను చెప్పిన విషయాలన్నీ వాస్తవాలేనని, వాటన్నింటికీ తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని, లేకుంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారని చెప్పారు. బీసీలకు ఏదో చేసేస్తానని చెబుతున్న చంద్రబాబు స్వాతంత్య్రం వచ్చాక ఎన్నికైన ఏకైక బీసీ ప్రధాని మోదీని పదవి నుంచి దించేయాలని ఎందుకు చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్లరద్దును చంద్రబాబు సమర్థించార్ననారు.