బీరు వద్దు నీరునిప్పించండి అంటూ..గ్రామాలలో మహిళలు ముందుకొచ్చారు.పలు ప్రాంతాల నుంచి మహిళా లోకం ముందుకు కదిలింది.ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ,‘బీరు వద్దు… నీరు ముద్దు’ అనే నినాదంతో ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయడానికి మహిళలందరూ పట్టు బిగించారు.ఇంతకు ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా?ఈనెల 19న కర్నాటకలోని చిత్రదుర్గ ప్రాంతం నుంచి ఈ మార్చ్ ప్రారంభమైంది.సుమారు 2,500 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు.రోజుకో 20 కిలోమీటర్ల నడుస్తూ,మార్గంమధ్యలో 23 జిల్లాల్లోని గ్రామాలకు చెందిన మహిళలకు మంచినీటి అవసరంపై అవగాహన కలిగిస్తున్నారు.అలాగే కర్ణాటకలో మద్యం నిషేదించడానికి తమవంతు కృషి చేస్తున్నారు.వెళ్లిన ప్రతిచోటా మహిళలకు మద్యం వల్ల కలిగే నష్టాల గురించి చెప్పుకొచ్చారు. మైసూరు, రామనాగర, చామరాజనగర, తుమకూరు, సిద్ధగంగ మఠం తదితర ప్రాంతాలకు చెందిన ఈ మహిళలంతా రేపు బెంగళూరులోని విధానసభకు చేరుకుంటారు. అక్కడే తమ సమస్యల్ని ప్రభుత్వానికి వివరించి న్యాయం చెయ్యాలని కోరనున్నారు.