ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్లోనూ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. టీఆర్ఎస్ ఎంపీలు ఎన్నోసార్లు పలు ప్రతిపాదనలు సమర్పించినా బడ్జెట్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కనీసం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కూడా కేటాయించలేదు. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదు. ఆయా సంస్థలకు కేటాయించే నిధులు సైతం అరకొరగానే ఉండటం విశేషం. సింగరేణికి రూ.1,850 కోట్లు కేటాయించగా.. గిరిజన యూనివర్సిటీకి రూ.4 కోట్లు బడ్జెట్ లో కేటాయించింది తాజా బడ్జెట్లో తెలంగాణకు పెద్దగా ప్రయోజనం జరగలేదు. కేంద్రం అరకొరగానే నిధులు కేటాయించిందనే విషయం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
బడ్జెట్ను విపులంగా పరిశీలిస్తే….
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయించిన నిధులు:
* సింగరేణికి – రూ.1850 కోట్లు
* ఐఐటీ హైదరాబాద్కి – రూ.80కోట్లు
* గిరిజన యూనివర్సిటీకి – రూ.4కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఇవే…
* పోలవరం తరహాలో కాళేశ్వరం ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని, నిధులు ఇవ్వాలని డిమాండ్.
* విభజన హామీల్లో భాగంగా ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం, భూపాలపల్లి జిల్లా ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, ఒక ఉద్యాన విశ్వవిద్యాలయం రావాల్సి ఉంది.
* తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్రం నుంచి నిధులు ఆశించింది.
* ఈ పథకాలకు కేంద్రం నిధులివ్వాలని నీతి ఆయోగ్ కూడా సిఫార్సు చేసింది.
* 2018 బడ్జెట్లో హైదరాబాద్ ఐఐటీకి రూ.75 కోట్లు ఇవ్వగా.. గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు మాత్రమే ఇచ్చారు.
* తెలంగాణలో 9 వెనుకబడిన జిల్లాలకు నిధులు ఆశించారు.