ఏపీలో టీడీపీ ప్రలోభాలపౌ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్ చెక్కులపై ఆరా తీస్తోంది. ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీచేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడా నికి సునీల్ అరోరా రాష్ట్రానికి వచ్చారు.
ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ తమ ఓటును తొలగించాలంటూ ప్రజలు దరఖాస్తు చేయకపోయినా ఇష్టారాజ్యంగా వారి ఓటును తొలగిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తున్నప్పుడు లబ్ధిదారులతో కొందరు వ్యక్తులు ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నామన్నారు. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకూ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొంతమంది సర్వేల పేరిట, కులాల పేరిట ఓట్లు తొలగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సూచించాం.
కొత్త ఓటర్ల నమోదు కోసం నియమించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఓటర్ నమోదు పాస్వర్డ్ ఇస్తున్నాం. ఇది దుర్వినియోగం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్లా ఓటర్లుగా ఉన్నవారిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఎన్నికల ముందు బదిలీలు, ప్రమోషన్లపై ముఖ్యంగా పోలీసు శాఖపై చాలా ఫిర్యాదులు అందాయి.. నిబంధనలకు అనుగుణంగా లేని బదిలీలు, పదోన్నతులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. డీజీపీ అధికార పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నారంటూ దీనికి ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కేసును ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ పరిధిలో ఉంది. ఇవికాకుండా డీజీపీపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఏమైనా వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.