తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా తమకు తీపికబురు వస్తోందని రెండు జిల్లాల నేతలు ఖుష్ అవుతున్నారు. స్వరాష్ట్ర ప్రదాత జన్మదినం నేపథ్యంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటే ఇందుకు కారణం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నారాయణ్పేట, ములుగును కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నారాయణ్పేట, ములుగును కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను ఇవాళ విడుదల చేసింది. దీంతో రేపట్నుంచి నారాయణ్పేట, ములుగు కొత్త జిల్లాలుగా మనుగడలోకి రానున్నాయి. తెలంగాణలో 31 జిల్లాలకు తోడు మరో రెండు కొత్త జిల్లాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరింది.
తాజాగా విడుదలైన ఆదేశాల ప్రకారం, 11 మండలాలతో నారాయణపేట జిల్లా, 9 మండలాలతో ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. నారాయణ్పేట జిల్లా పరిధిలోకి నారాయణ్పేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఉట్కూర్, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలు రానున్నాయి. ములుగు జిల్లా పరిధిలోకి ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి(సమ్మక్క సారక్క), ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట్, వెంకటాపురం, వాజేడు మండలాలు రానున్నాయి.