ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. అధికార టీడీపీని కాదని…వైసీపీ వైపు మొగ్గు చూపుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే పార్టీలో చేరేందుకు కీలక సమావేశం నిర్వహించారు. ఆయనే సీనియర్ నేత దాడి వీరభద్రరావు.
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఓ వెలుగు వెలిగి…అనంతరం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వైసీపీలో చేరిన సీనియర్ రాజకీయవేత్త దాడి వీరభద్రరావు ఆ పార్టీకి గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. వైసీపీలో ఉన్న సమయంలో ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినప్పటికీ, పలు కారణాల వల్ల దాడి వీరభద్రరావు బయటకు వచ్చేశారు. దాదాపు నాలుగేళ్లుగా ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఒక దశలో ఆయన తిరిగి తెలుగుదేశం, వైసీపీలోకి వెళ్లాలనుకున్నా, అనివార్య కారణాల వలన అది సాధ్య కాలేదు.
ఆయన తాజాగా వైసీపీ వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగా, అనకాపల్లిలో మద్దతుదారులతో దాడి భేటీ అయ్యారు. వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్న వీరభద్రరావు ఈ అంశంపై నేతలతో చర్చించారు. పార్టీలో చేరాలని వైసీపీ నేతలు కోరుతున్నారని చెప్పిన దాడి 10 రోజుల్లో క్లారిటీ ఇస్తానని పేర్కొన్నారు.