ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్ పరారైనట్లు తెలుస్తోంది. సంస్థ సర్వర్ల నుంచి కీలక సమాచారం డిలీట్ చేయడంతోపాటు మూడు హార్డ్ డిస్క్ లతో అశోక్ పరారీలో ఉన్నారని భావిస్తున్నారు. దీంతో అశోక్ కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు అతను డిలీట్ చేసిన సమాచారం రిట్రీవ్ చేయడంకోసం సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ అండదండలు అశోక్ కు ఉన్న నేపథ్యంలో అతను ఏపీలోనే ఉన్నాడని అనుమానిస్తున్నారు. అశోక్ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అతని పాస్పోర్ట్ వివరాలతో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సంస్థపై సోమవారం మరో కేసు నమోదైంది. హైదరాబాద్ మధురానగర్కు చెందిన జి. దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సార్ నగర్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా తయారు చేయించుకున్న ఈ యాప్లో ఇతర పార్టీలకు చెందిన వారిని అక్రమంగా లిస్టు నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. సేవామిత్ర వ్యవహారంపై దర్యాప్తు చేయాలని, అశోక్, కమలేష్, అబ్దుల్ సమా మరికొందరు కలిసి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటాను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతోపాటు యాప్లో ఉంచి సర్వే చేస్తున్నారని, ఈయాప్ ఉన్న ట్యాబ్లతో బూత్ స్థాయిలో ఓటర్ల వద్దకు టీడీపీ క్యాడర్ వెళ్లి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని 10 నుంచి 15 రకాల ప్రశ్నలు అడుగుతున్నారని, ఇలా టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను గుర్తించి తొలగిస్తున్నారని పేర్కొంది.
కేవలం ఓట్లు తొలగించడమే కాకుండా వారిని బ్లాక్లిస్ట్ లో పెట్టి ప్రభుత్వ పథకాలు చేరకుండా కుట్ర పన్నుతున్నట్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ గ్రిడ్స్కు చెందిన నిర్వాహకులపై ఐపీసీలోని 420, 419, 467, 468, 471, 120 (బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. కేసు నేపథ్యంలో అశోక్ను పట్టుకోవడానికి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అశోక్ విజయవాడ చుట్టుపక్కల తలదాచుకున్నట్లు గుర్తించారు. అతని కోసం రెండు బృందాలు బయలుదేరి వెళ్లాయి. అశోక్ను పట్టుకొని అన్ని కోణాల్లోనూ విచారిస్తే ఈ స్కాం వెనుక ఉన్న ఏపీ ప్రభుత్వ, టీడీపీ పెద్దల పేర్లు బయటకు వస్తాయని పోలీసులు అనుమానిస్తున్నారు.