బైరెడ్డి రాజశేఖర్రెడ్డి… రాయలసీమలో ఈ పేరు సుపరిచితం. తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అంటూ సొంత వేదిక ఏర్పాటు చేసుకున్నారు. అయితే, తనకంటూ సొంత గుర్తింపు కోసం బైరెడ్డి ఐదేళ్ల పాటు నడిపిన ఈ వేదికను నడిపి అనంతరం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చాపచుట్టేసిన బైరెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కండువా కప్పుకొన్నారు. అయితే, కాంగ్రెస్ నేతలతో కూడా ఆయనకు పొసగలేదు. దీంతో ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
డీసీసీ పదవి విషయంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో బైరెడ్డికి విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఇటీవలే ప్రకటించారు. గత ఏడాది ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరిన బైరెడ్డి ఏడాదికే సొంత దారి చూసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, బైరెడ్డి మళ్లీ తన సొంత గూడు అయిన టీడీపీ వైపు చూస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన బైరెడ్డికి ఇప్పుడు ఏ పార్టీలో చాన్స్ లేకపోవడంతో…తిరిగి టీడీపీలో చేరుతున్నారు.
కాగా, కొద్దికాలం క్రితం బైరెడ్డి టీడీపీపై విమర్శలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు వాడిన డైలాగులను అక్కడి ఓటర్లు నమ్మలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తమ పార్టీ ఓటమికి టీడీపీతో పోత్తే కారణమని స్పష్టం చేశారు. ఏపీలో కూడా టీడీపీతో కాంగ్రెస్ జత కలిస్తే తెలంగాణలో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ నిండా మునగడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని బైరెడ్డి తెలిపారు. ఇలా వ్యాఖ్యానించిన ఆయనకు టీడీపీ తిరిగి ఆహ్వానించడం ఆ పార్టీ స్థితికి నిదర్శనమంటున్నారు.