వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోమారు తెలుగుదేశం పార్టీ అన్యాయాలపై గళం విప్పారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన పలు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు అనంతరం ఢిల్లీ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీ ఎన్నికలను పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు చేసిన అనేక అక్రమాల గురించి సాక్ష్యాధారాలతో పాటు చేశామని తెలిపారు. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడేందుకు తగిన ఏర్పాట్లు చేసు కున్నారని పేర్కొన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆయన కుట్ర పన్నారని పేర్కొన్నారు. నూతన డీజీపీ నియామకం, ప్రస్తుత డీజీపీ తొలగింపు అంశాలతోపాటు ఇంటలిజెన్స్ విభాగం అధికారి వెంకటేశ్వరరావు, పోలీసు అధికారులు యోగానంద్ , విక్రాంత్ పాటిల్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని వచ్చామని విజయ సాయిరెడ్డి తెలిపారు.
పోలీసు విభాగంలో 37 మంది పోలీసుఅధికారులకు పదోన్నతి కల్పించారని, సూపర్ న్యూమరీ ద్వారా కొంత మంది అధికారులను ఎలివేట్ చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. చట్ట వ్యతిరేకంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ఎస్పీలుగా నాన్ కేడర్ ఆపీసర్లను నియమించారని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. పోలీసుల సాయంతో డబ్బును ఓటర్లకు పంచేందుకు వీలుగా తగిన బందోబస్తును ఏర్పాటు చేసి తరలిస్తున్నారని చెప్పారు.. శ్రీకాకుళంలో నారాయణ కాలేజీ నుంచి కారులో డబ్బు తరలిస్తుండగా తహశీల్దారు పట్టుకున్నారని, తీరా ఎన్నికల సామగ్రి ఉందని అధికారులు బుకాయించారని నిప్పులు చెరిగారు. వైఎస్ వివేకానందరెడ్డి హ్యతా కేసులో పోలీసులు అనుసరిస్తోన్న విధానాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని వచ్చామని విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, సజ్జల రామకృష్ణారెడ్డి టెలిఫోన్లను అక్రమంగా టాపింగ్ చేస్తున్నారని, వీరిద్దరి టెనిఫోన్లను టాప్ చేయాలని ఉన్నతాధికారులు రాసిన లేఖను ఎన్నికల సంఘానికి అప్పగించామని తెలిపారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏపాల్ పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు వైఎస్సార్సీపీ ఫ్యానుతో పోలి ఉండటం వల్ల ప్రజాశాంతి గుర్తును మార్చాలని ఎన్నికల సంఘాన్ని తిరిగి కోరామని, ఇది వరకు చేసిన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరామని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజాశాంతి పార్టీ కండువా కూడా మూడు రంగులు కలిగి ఉందని గుర్తు చేశారు. చంద్రబాబుతో అనైతిక సయోధ్య వల్లే కేఏపాల్ మోసానికి పాల్పడుతున్నారని ద్వజమెత్తారు. చంద్రబాబు అక్రమాల గురించి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు వివరిస్తామని, ఇవాళ ఎన్నికల సంఘం ప్రధానాధికారి అరోరాకు ఫిర్యాదు చేశామని విజయ సాయిరెడ్డి తెలిపారు.