టిక్ టాక్ యాప్ గురించి బహుశా తెలియని వారుండరు. యువతలో పెడధోరణులకు ఇది కారణమవుతోందని.. దీన్ని నిషేధించాలంటూ ఇటీవల డిమాండ్లు పెరిగిన విషయం తెలిసిందే. చివరకు కోర్టులు సైతం దీన్ని నిషేధించాలంటూ కేంద్రానికి సూచించాయి. తాజాగా టిక్ టాక్ యాప్ కోసం వీడియో చిత్రీకరిస్తుండగా..ఓ యువకుడు ప్రమాదవశాత్తూ తన మిత్రుణ్ని తుపాకీతో కాల్చాడు. దీంతో అతను మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం. సోహైల్, ఆమిర్ ఇద్దరూ దగ్గరి బంధువులు. దిల్లీలో నివాసముండే వీరివురూ తమ మిత్రుడు సల్మాన్తో కలిసి రాత్రి 9.45గంటల ప్రాంతంలో ఇండియా గేట్ వద్దకు కారులో బయలుదేరారు. తిరిగి వచ్చే సమయంలో సల్మాన్ కారు నడుపుతుండగా.. సోహైల్ పక్క సీట్లో కూర్చున్నాడు. టిక్టాక్ వీడియో చిత్రీకరిస్తానంటూ తన వద్ద ఉన్న ఓ దేశీయ తుపాకీ తీసి సల్మాన్కి గురిపెట్టి పోజిచ్చాడు. కారు రంజిత్సింగ్ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకోగానే..కుదుపునకు లోనై ప్రమాదవశాత్తూ చేతిలోని తుపాకీ పేలినట్లు సోహైల్ పోలీసులకు వివరించాడు. దీంతో బుల్లెట్ సల్మాన్ చెంపభాగంలోకి దూసుకెళ్లింది. భయాందోళనకు గురైన సోహైల్, ఆమిర్.. ధర్యాగంజ్లోని వారి బంధువుల ఇంటికి వెళ్లారు. రక్తపు మరకలు అంటిన దుస్తులను మార్చుకున్నారు. అక్కడి వారి బంధువు సాయంతో సల్మాన్ను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే అతను మరణించినట్లు ధ్రువీకరించుకున్న వైద్యులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తుల్నీ అరెస్టు చేశారు.