తెలంగాణ రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ ఆకాంక్ష యొక్క సత్తా చాటులున్నారు. అయితే, వారిపై మోదీ సారథ్యంలోని అధికారులు, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. వారణాసిలో పోటీచేయడం ద్వారా తమ సమస్య తీవ్రతను సమాజం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ నుంచి పసుపు రైతులు, ఫ్లోరోసిస్ బాధితులు సిద్ధమయ్యారు. అయితే దేశం మొత్తానికి ఒకే రకం ఎన్నికల నిబంధనలు ఉండగా.. వారణాసిలో ప్రత్యేక నిబంధనలు అమలుచేస్తున్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు.
నిబంధనల ప్రకారం, ఎంపీగా పోటీచేయడానికి దేశంలో ఓటు హక్కు ఉన్నవారు ఎవరైనా అర్హులే. నామినేషన్ వేసేవారు స్థానికంగా ఉన్న పది మంది ఓటర్ల సంతకాలు నామినేషన్పై పెట్టించాల్సి ఉంటుంది. మద్దతుదారుల వివరాలను అడగకుండా.. వారికి ఓటు హక్కు ఉందా? అనే అంశాన్ని పరిశీలించాలి. అయితే నామినేషన్పై సంతకాలు చేసిన పది మంది ఓటర్ల పేర్లను అభ్యర్థి కంఠస్థంగా చెప్పాలంటూ అధికారులు షరతు విధించారు. అలాగే మద్దతుగా సంతకం చేసిన ఓటర్ల కుటుంబసభ్యుల పేర్లు, వృత్తి, చిరునామా, ఫోన్నంబర్ ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతోపాటు నామినేషన్ వేసేందుకు చెల్లించాల్సిన డిపాజిట్ మొత్తాన్ని నగదుగా స్వీకరించాల్సి ఉండగా.. ఇక్కడ మాత్రం ట్రెజరీలో చలాన్ రూపంలో చెల్లించాలని చెప్తున్నారు. ఈ గిమ్మిక్కులన్నీ నామినేషన్ వేయడంలో తీవ్ర జాప్యం జరుగడానికే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వారణాసి స్థానం నుంచి నామినేషన్ వేసేందుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి వచ్చినవారు ఉంటున్న హోటళ్లు, మఠాలకు పోలీసులు వచ్చి వారిని త్వరగా ఖాళీచేయించాల్సిందిగా బెదిరిస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చినవారిని నామినేషన్ వేయకుండా చూసేందుకు జిల్లా యంత్రాంగంతోపాటు బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించకపోగా వాటిని దేశం దృష్టికి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.