ఫోని తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ఒరిస్సారాష్ట్రంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేసేందుకు తెలంగాణ నుండి 1000 మంది విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ఒరిస్సాకు వెళ్లారు. తుఫాను ప్రభావం వల్ల కరెంటు స్థంభాలు పడిపోయాయి. లైన్లు తెగిపోయాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయంలో సహకారం అందించాలని ఒరిస్సా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావుతో మాట్లాడారు. ఒరిస్సాకు కావాల్సిన సహాయం అందించాలని ఆదేశించారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన 1000 మంది ఉద్యోగులను ఒరిస్సాకు పంపాలని నిర్ణయించారు. మంగళవారం రాత్రి విద్యుత్ ఉద్యోగులు ఒరిస్సాకు బయలుదేరి వెళ్లారు.