ఉట్టికి ఎగరలేని వ్యక్తి స్వర్గానికి ఎగురుతారా? చాన్సే లేదు కదా? కానీ అలా ఎగురుతాడని అంటున్నారు..ప్రచారంలో ఆరి తేరిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు. అలా ఎగిరి అత్యుత్తమ స్థానాన్ని కైవసం చేసుకుంటారని చెప్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేస్తుంది ఇంకెవరి గురించో కాదు…తమ నాయకుడు అయిన చంద్రబాబు గురించి. తాజాగా చంద్రబాబు గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం ఏమంటే…కాబోయే ప్రధాని చంద్రబాబేనట…ఆయనే మోడీకి సరైన పోటీ అట!!
ఆశ్చర్యపోకండి…ఇదే తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం ఇది… “దేశంలో ప్రధాని పదవికి మోడీతో సరితూగగల నాయకుడు మరెవరూ కనిపించడంలేదు. ఎన్డీఎ కూటమిలో కూడా మోడీ పట్ల విముఖత పెరుగుతోంది. ఇక ప్రతిపక్ష యూపీఏ కూటమి మోడిని దింపడమే లక్ష్యంగా పని చేస్తోంది. అలాగని యూపీఏ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆమోదించలేక పోతోంది. రాహుల్గాంధీని ప్రధానిగా ఊహించలేక పోతోంది. యూపీఏ భాగస్వామ్య పక్షాలైన ప్రాంతీయ పార్టీలు గతంలోలా ప్రభావశీలంగా పని చేయలేక పోతున్నాయి. కానీ వీటన్నింటి లక్ష్యం ఒక్కటే. మోడీని మరో ఐదేళ్ళు ఢిల్లి గద్దెపైకెక్కకుండా చేయడమే. అటు ఎన్డిఎ, ఇటు యుపిఎ భాగస్వామ్య పక్షాలన్నీ ఈ అంశంలో సానుకూలత పాటిస్తున్నాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీల సీనియర్ నాయకులంతా వయోభారంతో బాధపడుతున్నారు. ఈ దశలో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రెండింటిని ప్రభావితం చేయగలిగే నాయకుడు చంద్రబాబు అవుతారని పరిశీలకులు అంచనాలేస్తున్నారు“ఇది వారి ప్రచార సారాంశం.
సొంత రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని కోల్పోతూ…ఇటు ఎమ్మెల్యే…అటు ఎంపీ సీట్లలో ఓటమి పాలయ్యే స్థితిలో ఉన్నారని అన్ని వర్గాల విశ్లేషణలో తేలుతున్న చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పనున్నారట. పైగా ప్రధానమంత్రి కానున్నారట. టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఎలా స్పందించాలో మీరే ఆలోచించుకోండి