లోక్సభ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగియడంతో మేనెల 23న ఫలితాలు రానున్నాయి. వాస్తవం చెప్పాలంటే 2014 లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపికి, మోడీకి గానీ ఈ ఎన్నికలు అంత సులవుగా లేవని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. గెలుపుకోసం నరేంద్రమోడీ, అమిత్షాలు ఊరూవాడా ప్రచారం చేసారు. అయితే గతంలో మాదిరిగా నమో నామస్మరణ గాని, మోడి ఆర్భాటాలు కనిపించలేదు. తన సర్కారు పాస్ అవ్వదనే భయంతోనే మోదీ సరిగ్గా ఎన్నికల బ్జడెట్లో రైతులకు సహాయ పథకాలు ప్రవేశపెట్టి గ్టటెక్కాలనుకున్నారని స్పష్టంగా అర్ధమయినా అది కూడా పేలనిబాంబుగా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో జరిగిన నోట్లరద్దు, జిఎస్టీ ఫలితాల ప్రభావం మాత్రం ప్రజలకు నేరుగా తాకింది. చాలామందిని రోడ్డున పడేసింది.
దీంతో మోడిపట్ల ప్రజలు అంతగా లేదనేది మరో కారణంగా అర్ధమవుతోంది. అయితే వ్యూహం ప్రకారం అంతా జరుగుతున్నట్టు ప్రజలకు అర్థమవడంతో మోదీషా జోడీ ఇరకాటంలో పడింది. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై బీజేపీ పెద్దలు మాట్లాడితే రాఫెల్ భూతం ముందుకొచ్చి బీజేపీని నిలదీసింది. టెర్రరిజంపై ఎక్కువ పోరాటం చేశామని చెబుదామనుకుంటే ఉరి, పుల్వామా ఘటనలు నిరోధించలేకపోయారనే ప్రశ్నలు వినిపించాయి. గాంధీకుటుంబ పాలన వంటి విమర్శలు ప్రధానంగా తీసుకున్నా ప్రయోజనం లేదు. ఇబిసి రిజర్వేషన్ల విషయంలోనూ అదే పరిస్థితి.. ఎన్నికలకు ముందు కావొచ్చు.. ఎన్నికల సందర్భంలో కావొచ్చు షామోదీలు వేయాలనుకున్న అస్త్రాలేవీ పనిచేయలేదు. ముఖ్యంగా హోదాహామి ఏపీలో బీజేపీని కోలుకోలేని దెబ్బతీసాయి. కర్ణాటకలో యాడ్యూరప్ప వ్యవహరాలు అప్రదిష్ట తెచ్చాయి.
తమిళనాడులో పళని ప్రభుత్వాన్ని ఒత్తిడిచేసి పొత్తు పెట్టుకున్నా డిఎంకేదే పైచేయిగా మారింది. తెలంగాణలో కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదు.. ఇక్కడ పార్టీ నాలుగో స్థానానికి పడిపోయింది. ఇలా ఉత్తర దక్షిణాది రాష్ట్రాల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీకి సరైన ఉద్వాసన దొరకలేదు. గతంలో సోనియా గాంధీని ఇటలీ వ్యక్తి అన్నవారు ఇప్పుడు రాహుల్ జాతీయతపై వివాదం పెట్టేందుకు ప్రయత్నించి మరీ విఫలమయ్యారు. అయిదేళ్ల పాలన గురించి, పాలనా సంస్కరణల గురించి ఘనంగా చెప్పుకోవడమే తప్ప భవిష్యత్తు గురించి ఒక ఆశాజనకమైన దృక్పథం ఆవిష్కరించలేదనేది ప్రజల మాట. 2014 ఎన్నికల ముందు గుజరాత్ ఫార్ములా అంటూ మోడీ తెరపైకి వచ్చి ఆయనే దేశానికి సరైన నాయకుడని అంతా భావించారు.
అద్వానీవంటి సీనియర్ల మనోభావాలను తెలుసుకోకుండా బీజేపీ నేతలు మోడీని తెరపైకి తెచ్చారు. వాస్తవానికి మోదీకి లభించినంతటి అద్భుతావకాశం దేశంలో మరెవరికీ దక్కలేదు. యావత్ దేశప్రజలంతా ఆయనపై నిజంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దేశం దశాదిశా మారుస్తారనుకున్నారు. కానీ ఐదేళ్ల తర్వాత ఆయనవల్ల దేశానికి లాభం సంగతి పక్కన పెడితే ప్రజలకు భారంగా తయారయ్యే నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లయినా కాంగ్రెస్ పుంజుకోకపోవడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుని అయినా మోడి మైలేజ్ మరింత పెరుగుతుందని చాలామంది బీజేపీ సీనియర్లు, ఆపార్టీ కార్యకర్తలు ఊహించారు. అయితే మోడి విధానాలు, పాలనా వ్యవస్థ బాగోలేకపోవడం వల్లే థర్డ్ ఫ్రంట్ లు ఆవిర్భవిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహాలు లేవు.