తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నేడు పేర్కొంది. మల్లన్నసాగర్ నిర్వాసితుల పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు సూచించింది.
కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల కోసం ఆపలేమని స్పష్టం చేసింది. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చునన్న సూచించింది. పరిహారం తీసుకోవడానికి నిరాకరించిన 60 మంది నిర్వాసితుల పరిహారాన్ని వారి లాయర్లకు అందజేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశానికి అనుగుణంగా నిర్వాసితులకు పరిహారాన్ని అందజేశారు.
దీంతో సహాయ పునరావస ప్యాకేజీ వంద శాతం పూర్తయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 175 కేసులను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలన్న ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టు అంగీకరించింది. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది.