ఎగ్జిట్పోల్స్ ఇచ్చిన షాక్ నుంచి తెలుగుదేశం పార్టీ ఇంకా కోలుకోలేదు. ఇటు ఏపీలో అధికారం కోల్పోవడంతో పాటుగా అటు ఎంపీ సీట్లలోనూ వైసీపీదే పైచేయి అని తేల్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆసక్తికరమైన రీతిలో స్పందిస్తున్నారు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైండ్ గేమ్స్ తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందని మండిపడ్డ ఆయన.. ఎన్నికల కమిషన్ చేసిన దుర్వినియోగం అంతా ఇంతా కాదన్నారు. ఎన్నికల కౌంటింగ్లో అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించి చంద్రబాబు.. వీవీ ప్యాట్ల లెక్కింపులోనూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు
మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి సత్తా చాటలేని చంద్రబాబు ఢిల్లీ వేదికగా హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లి.. వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతారని సమాచారం. అమరావతిలో ఉన్న చంద్రబాబు… ఈ నెల 23వ తేదీన కౌంటింగ్ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. అనంతరం ఢిల్లీ వెళ్లి కొందరు నేతలతో సమావేశం కానున్నారు. అయితే, కేవలం ఓటమి నుంచి దృష్టి మరల్చేందుకే ఇలా టూర్లు పెట్టుకుంటున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.