పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దారుణంగా ఓడిపోయారు. దెందులూరులో తనపై ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని విర్రవీగిన చింతమనేనికి భారీ షాక్ తగిలింది. చింతమనేనికి ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పారు అక్కడి ప్రజలు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఘన విజయం సాధించారు. గతంలో మహిళలను తూలనాడుతూ దాడులు చేసిన చింతమనేని ఓడిపోయారు. వివాదాస్పద వైఖరితో చింతమనేని నిత్యం వార్తల్లో ఉండేవారు. పండుగల సమయంలో కోడిపందాలు, జూదం వంటివి చేసే చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. తొలిసారి 2009 ఎన్నికలలో దెందులూరు ఎమ్మెల్యేగా 14235 ఓట్ల తేడాతో గెలిచిన ఆయన 2014 ఎన్నికలలో రెండోసారి టీడీపీ నుంచి పోటీచేసి 17746 ఓట్ల తేడాతో గెలిచారు. అక్కడినుంచి చింతమనేని వివాదాస్పద చర్యలు తారాస్ధాయికి చేరుకున్నాయి.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తమ్మిలేరులో ఇసుక అక్రమాలు, దెందులూరు నియోజకవర్గంలో నీరు చెట్టు పేరుతో అక్రమాలు, మట్టి దోపిడీ, పోలవరం కుడి కాలువ నుంచి మట్టి అక్రమ తరలింపులతో కోట్ల రూపాయలు దండుకున్నారు. అలాగే తనను ఎదురించిన అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయులు, మహిళలు , కార్మికులు, అందరిపై దౌర్జన్యకాండ కొనసాగించారని స్థానికులుచెబుతుంటారు. అయితే సొంతపార్టీ నేతలపై చేయిచేసుకోవడం చింతమనేనికి పరిపాట. 2014కు ముందు అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్ పై చేయిచేసుకోవడంతో భీమడోలు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించినా కూడా చింతమనేనిలో మార్పు రాలేదు. ఈయనపై 40కి పైగా కేసులున్నాయి. తాజా ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో 84.70 శాతం పోలింగ్ నమోదు కాగా దెందులూరు ప్రజలు మార్పును కోరుకున్నట్లు స్పష్టమైంది. వైసీపీ అభ్యర్ధి కొఠారు అబ్బయ్యచౌదరి చింతమనేనిపై విజయం సాధించారు.