ఏపీ రాజకీయాల్లో అనూహ్యమార్పులు కనిపించనున్నాయని తెలుస్తోంది. జగన్ దెబ్బకు కుదేలైన టీడీపీ వచ్చే ఎన్నికల్లోపు కనీసం కోలుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ టీడీపీ ఇప్పుడే కోలుకునేలా కనిపించట్లేదు.. మరోవైపు తాజాగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. దేశవ్యాప్తంగా ఫామ్ లో ఉన్న బీజేపీ అదే ఊపుతో ముందుకెళ్లేలా కమలనాథులు అడుగులేస్తున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్షా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణలోనూ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోనూ ఢీ అంటే ఢీ అనేలా తలపడేందుకు అడుగులేస్తోంది. తెలుగుదేశం పార్టీకి బదులు రెండోస్థానంలో బీజేపీ ఉండేలా చూసుకుంటుంది.
గత ఎన్నికల్లో టీడీపీతో కలిసివచ్చిన బీజేపీ ఇప్పుడు సొంతంగా బలపడేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్, ఆపరేషన్ ఆకర్ష్ ప్రక్రియను వేగవంతం చేసింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సహా మరో మాజీమంత్రి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే ఇప్పటికే ఉన్న సీనియర్లు, బలమైన క్యాడర్ తో పాటు ఇపుడు మళ్లీ చేరికలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో దాదాపుగా టీడీపీ మొత్తం ఖాళీ అయింది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయకపోవటం కూడా పార్టీ జెండా తెలంగాణ రాష్ట్రంలో పీకేసారని అర్ధమవుతోంది.
అయితే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజునుండే టీడీపీ నేతలు బీజేపీతో టచ్లోకి వెళ్లారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత టీడీపీలో ఓడిపోయినవారిలో చాలామంది చేరే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీలో పదవులు, అనుభవించిన చాలామందిని ఇప్పుడు అవినీతి భూతం వెంటాడుతోంది. జగన్ వదిలిపెట్టేలా లేడు కాబట్టి కనీసం బీజేపీలో ఉంటే బయటపడొచ్చని వారు బీజేపీలో చేరేందుకు సిద్ధమై చర్చలు జరిపినట్లు సమాచారం.వీరితోపాటు తెలంగాణ నేతలు మరికొందరిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధంచేసినట్లు తెలిసింది. అయితే ఎలాగో బీజేపీలోకి టీడీపీ నుంచి భారీ వలసలు ఉండేలా కనిపిస్తున్నాయి కాబట్టి టీడీపీ నేతలపైన, చంద్రబాబు పైనా కేసులున్నాయి కాబట్టి ఇప్పుడే టీడీపీ కోలుకోలేదు కాబట్టి తెలంగాణ తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేసి తర్వాత పరిస్ధితులను బట్టి ఏపీలోనూ టీడీపీని బీజేపీలో విలీనం చేసేయాలని బీజేపీ పెద్దలు టీడీపీ అధిన్యాయకత్వానికి సలహాలిచ్చారని తెలుస్తోంది.